హైదరాబాద్ : తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెలంగాణ అటవీ శాఖ పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ నిఘా విభాగం హైదరాబాద్లోని రామంతపూర్లో రైడ్ చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. వీరి వద్ద నుండి 330 ఇండియన్ టెంట్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ ఒకటిలో తాబేళ్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కావునా వీటిని పట్టుకోవటం, తరలించటం, అమ్మటం నేరం అన్నారు. ఇండియన్ టెంట్ లేదా అస్సాం రూఫుడ్ టార్టయిస్ గా పిలిచే ఈ తాబేళ్లు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన శివ బాలక్, రాహుల్ కాశ్యప్ లను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకుంది. లక్నో సమీపంలో గోమతి నదిలో వీటిని పట్టుకుని రైళ్ల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుకున్న ఇద్దరినీ మేడ్చల్ జిల్లా ఉప్పల్ రేంజ్ అధికారికి అప్పజెప్పారు. పెట్ షాపులు, అక్వేరియం షాపుల నిర్వాహకులు వీటిని కొంటున్నట్లు సమాచారం. తాబేళ్లను కొనటం, అమ్మటం నిషేధమని, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని షాపుల నిర్వాహకులను అటవీశాఖ హెచ్చరించింది. పీసీసీఎఫ్ (విజిలెన్స్) స్వర్గం శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరగింది. రమేష్ కుమార్, రేంజ్ అధికారి (యాంటీ పోచింగ్ టీమ్), జీ. సీతారాములు, వాహెద్, శ్రీనివాసులు, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.