న్యూఢిల్లీ: ఒక జంట వద్ద 45 పిస్టల్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో ఈ సంఘటన జరిగింది. జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ భార్యాభర్తలు. ఈ నెల 10న ఆ దంపతులు వియత్నం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చారు. జగ్జీత్ వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గన్స్పై ఆరా తీశారు. అయితే ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి విమానంలో వియత్నం వచ్చిన తన సోదరుడు మంజిత్ సింగ్ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్జీత్ సింగ్ తెలిపాడు.
కాగా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ)కి చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం ఈ కేసుపై దర్యాప్తు జరుపుతోంది. దంపతులు జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ నుంచి స్వాధీనం చేసుకున్న 45 పిస్టల్స్ విలువ రూ.22.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు గతంలో కూడా టర్కీ నుంచి 25 పిస్టల్స్ను భారత్కు తీసుకొచ్చినట్లుగా దర్యాప్తులో ఆ జంట వెల్లడించింది. దీంతో బుధవారం వారిద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు, గన్స్ అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నారు.