Aaftab Poonawala | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్తాబ్కు కోర్టు విధించిన ఐదు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఢిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సాకేత్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం అతడిని విచారించగా.. శ్రద్ధాను హత్య చేసింది తానే అని అంగీకరించాడు. క్షణికావేశంలోనే శ్రద్దాను హత్య చేసినట్టుగా చెప్పాడు.
‘‘శ్రద్ధాను నేనే హత్య చేశా. ఆ రోజు జరిగింది ఏదైతే ఉందో.. అదంతా ఘర్షణ వాతావరణంలో క్షణికావేశంలో జరిగింది. కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తున్నా. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ప్రదేశానికి సంబంధించిన మ్యాప్లను కూడా ఇచ్చా. శ్రద్ధా హత్యకు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులకు అందజేస్తా. అయితే, ఘటన జరిగి చాలా కాలం గడిచినందున చాలా విషయాలు గుర్తుకు రాలేదు’ అని ఆఫ్తాబ్ కోర్టులో తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్కు పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులకు పొడిగించింది.