చెన్నై : భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆగ్రహంతో ఆమె ప్రియుడిని అంతమొందించిన వ్యక్తి ఉదంతం తమిళనాడులోని వేలంపాళ్యంలో వెలుగుచూసింది. నిందితుడు సీ శశికుమార్ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువరూర్ జిల్లాకు చెందిన నిందితుడు అనుప్పరపాళ్యంలోని తిలక్నగర్లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు.
బనియన్ ఫ్యాక్టరీలో పనిచేసే వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. నిందితుడి భార్య ప్రియకు అదే ఫ్యాక్టరీలో పనిచేసే తమిళరాసన్తో ఏడాదిగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ప్రియ భర్తకు తెలియగా బుద్ధిగా ఉండాలని ఇద్దరినీ హెచ్చరించాడు. ఇక వేలంపాళ్యంలో నివసిస్తున్న తమిళరాసన్ భార్య కొన్నేండ్ల కిందట మరణించడంతో పిల్లలు, తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు.
అయితే తమిళరాసన్ ఇంటికి తరచూ ప్రియ వచ్చి వెళుతుండేది. పలుమార్లు హెచ్చరించినా వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు తమిళరాసన్పై దాడికి తెగబడి హత్య చేశాడు. హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.