భోపాల్ : రాత్రి, పగలు తేడా లేకుండా మొబైల్ ఫోన్లో మునిగితేలుతున్న కోడలిని మందలించడం అత్త ప్రాణాల మీదకు తెచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుతున్న కోడలిని తరచూ అత్త వారించేది. అదేపనిగా మొబైల్ ఫోన్తో రోజంతా గడుపుతున్నదని కొడుకుకు కూడా అత్త ఫిర్యాదు చేస్తుండేది.
అత్త తీరుతో విసిగిన మహిళ చివరికి ఆమెను అంతమొందించిన ఉదంతం మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్త తల నరికి హత్య చేసిన మహిళ రోడ్డు ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయని భర్తకు ఫోన్లో తెలిపింది. ఇంటికి వచ్చిన భర్తకు తల్లి విగతజీవిగా కనిపించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులకు మహిళ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారు గట్టిగా నిలదీయడంతో నేరాన్ని అంగీకరించింది. మొబైల్ ఫోన్లో రాత్రి సమయాల్లో మాట్లాడుతుంటే భర్తకు తనపై ఫిర్యాదు చేస్తోందనే కోపంతో ఆమెను కడతేర్చానని తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.