చండీఘఢ్ : హర్యానాలోని హిస్సార్లో దారుణం వెలుగుచూసింది. మాజీ భర్త తనను తిరిగి పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి దబ్రా చౌక్లోని ఓ హోటల్లో తనతో మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడని ఆరోపించింది.
సెలూన్లో పనిచేసే మహిళకు 2019లో నిందితుడితో వివాహమైంది. పెండ్లయిన కొద్దిరోజులకే భర్త, అత్తమామలు కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. దీంతో మెట్టినింటి వారిపై మహిళ గృహ హింస కేసు దాఖలు చేసింది. ఆపై 2021 ఆగస్ట్లో వీరు విడాకులు తీసుకున్నారు. 2021 సెప్టెంబర్లో నిందితుడు తనకు క్షమాపణ చెప్పి ఉంగరాన్ని బహుకరించి తిరిగి పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.
ఇక ఈ ఏడాది పిబ్రవరి 9న నిందితుడు ఆమెను దబ్రా చౌక్లోని హోటల్కు రప్పించి కూల్డ్రింక్లో మత్తుపదార్ధాలు కలిపిన పానీయం ఇచ్చాడు. ఆపై మహిళ స్ప్రహ కోల్పోగానే ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు రికార్డు చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. ఆమెను తిరిగి పెండ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.