చెన్నై : తమిళనాడులో దారుణం జరిగింది. మైనర్ బాలిక(16)ను ఆమె ఇద్దరు బంధువులు, 77 ఏండ్ల పొరుగింటి వృద్ధుడు సహా ఎనిమిది మంది లైంగిక వేధింపులకు గురి చేశారు. గత ఆరు నెలలుగా ఈ దారుణం జరుగుతుండగా ప్రస్తుతం బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ నేరానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విల్లుపురం జిల్లా గింజీ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లి మరణించడంతో బాధిత బాలిక గింజీలోని తన అత్త ఇంట్లో ఉంటోంది. బాలిక స్ధానిక ప్రభుత్వ పాఠశాలలో పదకొండో తరగతి చదువుతోంది. కొద్దిరోజులుగా బాలిక అస్వస్ధతతో ఉండగా బంధువులు ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా ఆమె ఆరు నెలల గర్భవతని వెల్లడైంది.
ఈ విషయమై పోలీసులు బాలికను ప్రశ్నించగా ఆరు నెలల నుంచి తన కజిన్తో పాటు ఎనిమది మంది తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడులకు పాల్పడుతున్నారని వెల్లడించింది. నిందితుల్లో ఆమె బంధువులు ఇద్దరితో పాటు పొరుగింటి వృద్ధుడు (77) కూడా ఉన్నాడు. నిందితులందరినీ ఆదివారం అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.