భోపాల్ : వివాహేతర బంధం 63 ఏండ్ల వృద్ధుడి ఉసురుతీసింది. భార్యా భర్త కలిసి వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన ఉదంతం మధ్యప్రదేశ్లోని రెవాలో వెలుగుచూసింది. బాధితుడితో మహిళ వివాహేతర సంబంధం సాగిస్తుండగా వారి వ్యవహారం భర్తకు తెలియడంతో దంపతులు ఇద్దరూ కలిసి వృద్ధుడిని అంతమొందించాలని నిర్ణయించారు. తొలుత బాధితుడు రాజ్కుమార్ మిశ్రా గుండెపోటుతో మరణించాడని అధికారులు భావించారు.
మిశ్రాను హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. రెవా జిల్లాలోని మహరియా గ్రామంలో ఈ ఘటన మే 27 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. నిందితుల్లో ఒకరైన శ్యాంలాల్ కోల్ అర్ధరాత్రి ఇంటికి రాగా ఆ సమయంలో భార్య సునీతా కోల్ కనిపించకపోవడంతో ఆమె కోసం తోటలోకి వెళ్లాడు. అక్కడ భార్య వృద్ధుడితో అభ్యంతరకరంగా కనిపించడంతో వారు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు.
దీంతో దంపతులు ఇద్దరూ బాధితుడి గొంతునులిమి ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీశారు. ఆపై బాధితుడి నుంచి విలువైన వస్తువులను దొంగిలించిన నిందితులు మృతదేహాన్ని దూరంగా పడేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి బాధితుడి నుంచి దొంగిలించిన గోల్డ్ చైన్, నగదును స్వాధీనం చేసుకున్నారు.