ముంబై : ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. అమాయక యూజర్లను మోసగించేందుకు స్కామర్లు రోజుకో కొత్త ట్రిక్కులతో హడలెత్తిస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేయడంతో పాటు వారి బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మునూ లూటీ చేస్తున్నారు. తాజా స్కామ్లో ఆన్లైన్లో బీరు ఆర్డర్ చేస్తూ ముంబైకి చెందిన 24 ఏండ్ల అడ్వకేట్ ఏకంగా ఆన్లైన్ స్కామ్లో రూ 44782 సమర్పించుకున్నాడు. లిక్కర్ షాప్ యజమానిగా బిల్డప్ ఇచ్చిన స్కామర్ రెండు బీరు బాటిళ్లు డెలివరీ చేస్తానని టోకరా ఇచ్చాడు. తన ఇంటికి లిక్కర్ను డెలివరీ చేసే మద్యం షాపుల కోసం బాధితుడు ఆన్లైన్లో సెర్చ్ చేశాడు.
ఓ నెంబర్ దొరకడంతో పలుసార్లు ఆ మొబైల్ ఫోన్కు కాల్ చేసినా అవతలి నుంచి ఎవరూ లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత వైన్ షాపు యజమాని అంటూ స్కామర్ నుంచి బాధితుడికి మెసేజ్ వచ్చింది. వాట్సాప్ నుంచి ఆర్డర్ చేయాలని స్కామర్ కోరాడు. ఆపై రూ 360కి రెండు బీర్లు డెలివరీ చేయాలని ఆర్డర్ చేశాడు. రెండు బీర్లకు పేమెంట్ కోసం స్కామర్ బాధితుడికి ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. డెలివరీ ఫీజు కింద అదనంగా రూ 30 చెల్లించాలని కోరాడు. ఆపై రెండు బీర్లకు రూ 4999 చెల్లించాలని బాధితుడిని కోరాడు. కేవలం 499 మాత్రమే బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుందని నమ్మబలికాడు.
బాధితుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ 499తో పాటు రూ 4999 కట్ అయ్యాయి. తన డబ్బు తిరిగి చెల్లించాలని లాయర్ కోరగా స్కామర్ మరో క్యూఆర్ కోడ్ పంపాడు. రిఫండ్ కోసం లాయర్ ఈ కోడ్ను స్కాన్ చేయగానే ఈసారి ఏకంగా రూ భారీ మొత్తం డెబిట్ కావడంతో లాయర్ లబోదిబోమన్నాడు. పలుమార్లు తన ఖాతా నుంచి రూ 44,782 డెబిట్ అయ్యాయని బాధితుడు వాపోయాడు. దీంతో స్కామర్కు లాయర్ మరోసారి ఫోన్ చేయగా అతడి ఫోన్ను బ్లాక్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.