న్యూఢిల్లీ : ఏడాది పాటు మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆమె డబ్బులు అడుగుతూ తప్పుడు కేసు పెడతానని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని నమ్మించి గొంతుకోశాడు. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో మహిళ హత్య కేసును విచారించిన పోలీసులు ఈ వివరాలు బయటపెట్టారు. యూపీకి చెందిన మహిళ వారం కిందట తన మరదలిని కలిసేందుకు ఢిల్లీ వచ్చింది. జూన్ 23న మోహన్ గార్డెన్లోని లాల్ ఫాం వద్ద మహిళ హత్యకు గురైందనే సమచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులకు మృతదేహం కంటపడింది.
నిందితుడు చున్నీని ఆమె గొంతుకు బిగించి ఊపిరిఆడకుండా చేసి ఉసురు తీశాడని వెల్లడైంది. ఘటనా స్ధలంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు వివిధ మార్గాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. యూపీలోని ఉత్తం నగర్ ప్రాంతం నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బాధితురాలి మొబైల్ ఫోన్ను, నేరం జరిగిన సమయంలో నిందితుడు ధరించిన దుస్తులను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాదిగా బాధితురాలితో నిందితుడికి వివాహేతర సంబంధం ఉంది.
కొద్దిరోజులుగా డబ్బులు ఇవ్వాలని నిందితుడిని బాధితురాలు డిమాండ్ చేయడంతో పాటు తప్పుడు కేసు పెడతానని బెదిరిస్తోంది. దీంతో ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మరదలిని కలిసేందుకు జూన్ 22న బాధితురాలు ఢిల్లీకి రాగా, మహిళను సంప్రదించిన నిందితుడు తనతో ఓ రాత్రి గడపాలని నమ్మబలికాడు. అదేరోజు అర్ధరాత్రి ఆమెను మోహన్ గార్డెన్ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను ఊపిరిఆడకుండా చేసి హత్య చేశాడు. ఆపై ఆమె మొబైల్ ఫోన్ను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.