లక్నో : వదినపై కన్నేసిన మరిది ఆమె నిరాకరించడంతో పదునైన ఆయుధంతో అన్న గొంతు కోసి ఉసురుతీసిన ఉదంతం యూపీ రాజధాని లక్నోలో వెలుగుచూసింది. నగరంలోని చిన్హత్ ప్రాంతంలో అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. నిందితుడు భూపేంద్ర సాహు అన్న మోహిత్ సాహు భార్యపై కన్నేసి ఆమెను ఆకర్షించేందుకు పలుమార్లు ప్రయత్నించాడు.
మరిదిని దూరం పెడుతూ వచ్చిన ఆమె ఈ విషయం భర్తకు తెలిపింది. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న భూపేంద్రపై ఆగ్రహానికి లోనైన మోహిత్ సాహు సోదరుడిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరాడు. అన్న తనను ఇంటి నుంచి గెంటివేశాడనే అనుమానంతో భూపేంద్ర పగతో రగిలిపోయాడు. మోహిత్పై కోపం పెంచుకున్న భూపేంద్ర శనివారం రాత్రి సోదరుడి ఇంటికి వెళ్లి అతడితో గొడవ పడ్డారు.
ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో నిందితుడు పదునైన ఆయుధంతో మోహిత్ గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన మోహిత్ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భూపేంద్ర సాహును అరెస్ట్ చేయగా దర్యాప్తులో భాగంగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తనను ఇంటి నుంచి వెళ్లిపొమ్మనడంతోనే పగతో మోహిత్ను చంపేశానని తెలిపారు. తనకు, సోదరుడికి మధ్య దూరం పెరిగేందుకు మోహిత్ భార్యే కారణమని పేర్కొన్నాడు.