ముంబై : ప్రియురాలితో పెండ్లి ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి (26) గర్ల్ఫ్రెండ్ తండ్రిని పార్టీకి పిలిచి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. నిర్జన ప్రదేశంలో బాధితుడు కమల్జిత్ సండే (52)ను పార్టీకి ఆహ్వానించిన నిందితుడు నేరానికి ఒడిగట్టాడు. గొంతుకోసి కమల్జిత్ను చంపిన నిందితుడు ఆపై గర్ల్ఫ్రెండ్కు ఫోన్ చేసి మీ తండ్రి ఇక ఎప్పటికీ ఇంటికి రాలేడని చెప్పాడు. హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మార్చి 19 వరకూ కస్టడీకి తరలించారు. నిందితుడిని బిహార్కు చెందిన పప్పుకుమార్ షాగా గుర్తించారు.
నిందితుడు జీవనోపాధి కోసం చిన్నచిన్న పనులు చేస్తూ పొట్టపోసుకుంటాడని దర్యాప్తులో వెల్లడైంది. గత ఐదేండ్లుగా నిందితుడు ఉల్హాస్నగర్లో నివసిస్తున్నాడని బాధితుడి కూతురితో సంబంధం కలిగిఉన్నాడని తేలింది. కమల్జిత్ కూతురిని వివాహం చేసుకుంటానని నిందితుడు వెల్లడించగా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆపై క్షమాపణ కోరిన నిందితుడు కమల్జిత్తో స్నేహంగా ఉంటున్నాడు.
పెండ్లి ప్రతిపాదనను తిరస్కరించాడనే కోపం మనసులో పెట్టుకున్న నిందితుడు పధకం ప్రకారం కమల్జిత్ను పార్టీ చేసుకుందామని నిర్జన ప్రదేశానికి పిలిచి ఘాతుకానికి తెగబడ్డాడు. భివాండి రూరల్ ప్రాంతంలోని గోడౌన్ సమీపంలో ఇద్దరూ పీకల దాకా మద్యం సేవించారు. తాగిన మైకంలో కూరుకుపోయిన కమల్జిత్ గొంతు కోసిన నిందితుడు అతడిని హత్య చేశాడు. నిందితుడు పప్పుకుమార్ షాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.