అహ్మదాబాద్ : గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఓ వ్యక్తి ఇన్స్టాగ్రాం పోస్ట్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత మహిళ తల్లితండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి (27)పై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2019 నవంబర్లో మహిసాగర్ జిల్లా దెబర్ గ్రామానికి చెందిన వ్యక్తిని మహిళ వివాహం చేసుకుంది.
ఆపై మహిళను ఇంటి నుంచి పంపడంతో అప్పటినుంచి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. గత ఏడాది జులైలో దంపతుల మధ్య గొడవ జరగడంతో అప్పట్లోనే నిందితుడు ఆమెకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చి బలవంతంగా మెట్టినింటి నుంచి పంపాడు. అప్పట్లో తనకు ట్రిపుల్ తలాఖ్ నిషేధ చట్టం గురించి తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల భర్త కదలికలను గమనించేందుకు బాధితురాలు వేరే పేరుతో సోషల్ మీడియా ఖాతాను తెరిచింది. ఈ ఖాతా భార్యదేనని పసిగట్టిన నిందితుడు సోషల్ మీడియా వేదికపైనే మరోసారి ట్రిపుల్ తలాఖ్ చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత మహిళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాఖ్ నేరంగా పరిగణించే ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.