ముంబై : మహారాష్ట్రలోని పుణేలో దారుణం వెలుగుచూసింది. స్కూల్ వాష్రూంలో బాలిక (11)పై 40 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులకు ఫిర్యాదు అందిన 10 గంటల్లోపే నిందితుడు మంగేష్ను అరెస్ట్ చేశారు. గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి తనపై స్కూల్ వాష్రూంలో లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక కుటుంబసభ్యులకు తెలుపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆపై పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి నిందితుడిని పట్టుకున్నారు. అజ్ఞాత రేపిస్ట్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు పలువురిని ప్రశ్నించారు. ఆపై నిందితుడి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. సాయంత్రానికి నిందితుడిని శివాజీనగర్లోని మద్యం షాపు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్కూల్ ఆవరణలో నిందితుడు బాలిక వద్దకు చేరుకుని తాను ఆమె తండ్రి స్నేహితుడినని చెబుతూ బలవంతంగా వాష్రూంలోకి గుంజుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు. బాలిక నేరుగా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ఈ విషయం తెలిపింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమె ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వెల్లడైంది. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.