రాంచీ : బాలిక(15)ను కిడ్నాప్ చేసి కారులో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం జార్ఖండ్ రాజధాని రాంచీలో వెలుగుచూసింది. నిందితులు బుధవారం రాత్రి ధుర్వ రింగ్ రోడ్డు వద్ద తనను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారని బాలిక పోలీసులకు వెల్లడించింది. రతు పోలీస్ స్టేషన్ పరిధిలో దలదాలి ప్రాంతంలోని రెస్టారెంట్ వద్ద పార్కు చేసిన కారును పెట్రోలింగ్ పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా ఈ దారుణం బయటపడింది.
కారులో ఐదుగురు వ్యక్తులు ఉండగా బాలిక ఏడుస్తుండటంతో పోలీసులు బాలికను కాపాడి నిందితులను అరెస్ట్ చేశారని రాంచీ రూరల్ ఎస్పీ నౌషద్ ఆలం తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.