కోయంబత్తూర్ : ప్రియురాలిని కలిసేందుకు ప్రయత్నించిన దళిత యువకుడి (18)ని కొందరు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా అనైమలై గ్రామంలో వెలుగుచూసింది. దళితేతర వర్గానికి చెందిన ప్రియురాలి (19)ని కలిసేందుకు యువకుడు ప్రయత్నించడంతో ఆగ్రహించిన స్ధానికులు అతడిపై దాడికి తెగబడ్డారు.
భూస్వామి రామస్వామి పొలంలో పనిచేసే దళిత యువకుడు యజమాని ఇంట్లో పనులు చేసే మధురైకి చెందిన దళితేతర యువతికి దగ్గరయ్యాడు. ఈ విషయం తెలిసిన రామస్వామి దళిత యువకుడిని పని నుంచి తొలగించాడు. యువతిని కలిసేందుకు అక్కడికి వచ్చిన యువకుడిని అతడిని కట్టేసి దారుణంగా కొట్టారు. యువతిని తనతో పంపాలని రామస్వామిని కోరగా దళిత యువకుడిని కొబ్బరితోటలోకి తీసుకెళ్లిన రామస్వామి అనుచరులు అతడిని దారుణంగా హింసించారు.
దళిత యువకుడిపై దాడికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నిందితులపై ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరాయి. దళిత యువకుడిపై దాడికి పాల్పడిన నిందితుడు రామస్వామి సహా కాళిముత్తు, కేశవన్, రసాతి సహా ఇద్దరు కార్మికులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.