హయత్నగర్ :హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ కాలనీలోని రాచకాలువపై గురువారం తెల్లవారుజామున కొంతమంది ఆక్రమణదారులు, ట్రాన్స్జెండర్లు కలిసి గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న హయత్నగర్ మం డల తహసీల్దార్ సుశీల, రెవెన్యూసిబ్బంది, మున్సిపల్ అధికారులతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
తహసీల్దార్ ఫిర్యాదు మేరకు హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ ఆదేశాల మేరకు అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సర్వే నెం. 199లో భూమి పట్టాదారు జంగం శ్రీనివాస్ అనే వ్యక్తి రాచకాలువను కబ్జాచేసేందుకు పలువురితో కలిసి కుట్రపన్ని గుడిసెలు వేసి కబ్జాకు పాల్పడినట్లు రెవెన్యూ అధికారి తహసీల్దార్ సుశీల అభిప్రాయపడ్డారు.
రాచకాలువపై అక్రమంగా వెలిసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నించగా గుడిసెలు వేసుకున్న మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు తాము ఏమీ చేయలేమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఎస్ఐ నరేందర్రెడ్డి, కిరణ్రెడ్డి, ఏఎస్ఐ రాజేష్, నర్సిరెడ్డి, తాహెరాబేగం, కానిస్టేబుల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హయత్నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 199, 213, 207ల మధ్య 33 ఫీట్ల వెడల్పుతో ఉన్న రాచకాలువపై పలువురు ఆక్రమణదారులు కన్నేసి గుడిసెలు వేసుకుని కబ్జాకు పాల్పడ్డారు. ఈ రాచకాలువ సాహెబ్నగర్, సుక్కోనికుంట నుండి మొదలైన రైస్మిల్లును ఆనుకోని సర్వే నెం.199, 213ల మధ్యగా దేశ్ముఖ్ రెవెన్యూ, హయత్నగర్ మండల రెవెన్యూ సర్వే నెం.255 మీదుగా బాగ్ హయత్నగర్లోకి ప్రవహిస్తుంది.
దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర దూరం ప్రవహిస్తున్న రాచకాలువ పలుచోట్ల ఆక్రమణలకు గురైంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపం వల్లనే రాచకాలువ కనుమరుగయ్యే దుస్థితి దాపురించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా సర్వే నెం.199, 213ల మధ్యనున్న రాచకాలువ దాదాపు 2వేల గజములు, రూ.8 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.