సికింద్రాబాద్ : ఆర్మీలో పనిచేస్తున్న తాను ఫ్లాటును అద్దెకు తీసుకుంటానని నమ్మబలికి ఆన్లైన్ ద్వారా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి రూ.89,999లు తస్కరించారు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ బోయిన్ పల్లి ఆర్ఆర్ నగర్ నాగిరెడ్డికాలనీకి చెందిన ఎంవీఎస్ మాధవ్ (49) సాఫ్ట్వేర్ ఇంజినీర్.
తార్నాక నాచారంలోని ఓ అపార్ట్మెంట్లో తనకున్న ప్లాట్ను రూ.15 వేలకు అద్దెకు ఇస్తానంటూ సెప్టెంబరు 17న 99 ఎకర్స్. కామ్లో పోస్టు చేశాడు. ఆ మరుసటి రోజున మాధవ్కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన పేరు సచిన్ శర్మ అని ఆర్మీలో ప్రస్తుతం ఫుణెలో పనిచేస్తున్న తనకు హైదరాబాద్కు బదిలీ అయ్యిందని చెప్పాడు.
బదిలీపై రానున్న తాను ప్లాట్ను అద్దెకు తీసుకుంటానని, అందుకుగాను తొలుత రెండు నెలల అడ్వాన్సుకింద రూ.30 వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని నమ్మబలికాడు. అతడి మాటలను విశ్వసించిన బాధితుడు ఆగంతకుడు పంపించిన క్యూఆర్ కోడ్లను మూడుమార్లు స్కాన్ చేశాడు.
దీంతో ఆగంతకుడు బాధితుడి ఖాతాలోంచి దఫాలవారీగా మొత్తం రూ.89,999లను తస్కరించాడు. ఎంత ప్రయత్నిం చినా ఆగంతకుడి వివరాలు లభ్యంకాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.