న్యూఢిల్లీ: ఒక భవనం పాక్షికంగా కూలింది. ఈ దుర్ఘటనలో బాలికతో సహా నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పారిశ్రామిక ప్రాంతమైన నరేలాలో నాలుగంతస్తుల భవనంలోని ఒక భాగం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలతో శిథిలాలను వెలికి తీశారు. ఫాతిమా, షెహనాజ్ అనే ఇద్దరు మహిళలను శిథిలాల నుంచి కాపాడారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే షెషనాజ్ కుమార్తెతో పాటు మరో ముగ్గురు చనిపోయారు. శిథిలాలను పూర్తిగా తొలగించగా నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను తొమ్మిదేళ్ల అఫ్రీన్, రుకేయా ఖాటూన్, షెహజాద్, డానిష్లుగా గుర్తించారు.
మరోవైపు రాజీవ్ రతన్ అవాస్ గృహా సముదాయంలో సుమారు 400 ఫ్లాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులోని ఒక పురాతన భవనంలో ఒక వైపు భాగం కూలిందని చెప్పారు.