న్యూఢిల్లీ: ఒక బాలికపట్ల ఆమె తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి మిద్దెపై మండుటెండలో ఉంచారు. దీంతో ఎండను తట్టుకోలేక ఆ చిన్నారి విలవిల ఏడ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఒకరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జూన్ 2న కరవాల్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు ఈ వీడియోను ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలికను దారుణంగా శిక్షించిన తల్లిదండ్రులను, ప్రాంతాన్ని గుర్తించేందుకు నానా తిప్పలు పడ్డారు. తొలుత కరవాల్ నగర్ ప్రాంతంలో ఆరా తీయగా ఆ ప్రాంతంలో అలాంటి సంఘటన జరుగలేదని తెలిసింది. అనంతరం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. చివరకు ఖజురి ఖాస్ ప్రాంతంలో ఒక ఇంటిని గుర్తించారు. ఆ బాలిక తల్లిదండ్రులను దీనిపై ఆరా తీశారు. అయితే స్కూల్ హోమ్ వర్క్ చేయలేదన్న కోపంతో కేవలం 5-7 నిమిషాల పాటు ఇలా శిక్షించినట్లు బాలిక తల్లి పోలీసులకు చెప్పింది.
మరోవైపు బాధిత బాలిక, ఆమె కుటుంబాన్ని గుర్తించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి తల్లిదండ్రులపై తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
#Delhi: Horrific visuals show a 5-year-old girl being punished by her parents.
The girl in the video can be seen crying as she was left alone on the roof with her hands and feet tied. pic.twitter.com/Wd7m76vmMR
— Aditya Paul (@AdityaPaul1999) June 8, 2022