పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో 26 ఏండ్ల జిమ్ ట్రైనర్ విక్రమ్ సింగ్పై కొందరు వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. శనివారం ఉదయం అతడు బైక్పై పాట్నా మార్కెట్లోని జిమ్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శరీరంలోకి ఐదు తుపాకీ బుల్లెట్లు దిగినప్పటికీ విక్రమ్ సింగ్ బైక్ నడుపుతూ 2.5 కిలోమీటర్ల దూరంలోని పాట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఆయనకు ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. సృహలోకి వచ్చిన విక్రమ్ సింగ్ తనపై కాల్పులకు జేడీయూ నేత రాజీవ్ కుమార్ సింగ్, ఆయన భార్య ఖుష్బు కారణమని ఆరోపించాడు. దీంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
జేడీయూ నేత రాజీవ్ కుమార్ సింగ్ భార్య ఖుష్బుతో జిమ్ ట్రైనర్ విక్రమ్ సింగ్కు ఈ ఏడాది జనవరి నుంచి పరిచయం ఉన్నది. వీరిద్దరి మధ్య వెయ్యికిపైగా ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయి. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం నేపథ్యంలో విక్రమ్ సింగ్ అడ్డు తొలగిస్తానని రాజీవ్ కుమార్ సింగ్ ఇటీవల బెదిరించాడు. ఈ నేపథ్యంలో విక్రమ్ హత్యకు సింగ్, ఆయన భార్య ఖుష్బు కుట్ర పన్నారన్ని, కిరాయి హంతకులతో అతడ్ని హత్య చేసేందుకు యత్నించారని పోలీసులు ఆరోపించారు.
కాగా, ఫిజియోథెరపిస్ట్ అయిన జేడీయూ నేత రాజీవ్ కుమార్ సింగ్ వైద్యుల సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ఆయనను తొలగించారు.