న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు (cyber fraud)చెలరేగుతూ ఆన్లైన్ వేదికగా అమాయకులను అడ్డంగా దోచేస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. పార్ట్టైం జాబ్లతో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును స్కామర్లు లూటీ చేస్తున్నారు.
తాజాగా గురుగ్రాంకు చెందిన ఓ వ్యక్తి ఆదాయం కోసం యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తూ ఏకంగా రూ. 8.5 లక్షలు పోగొట్టుకున్నాడు. యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే ఒక్కో వీడియోకు రూ. 50 ఇస్తామని స్కామర్లు బాధితుడిని మభ్యపెట్టారు. ఆపై మర్చంట్ టాస్క్ల పేరుతో మనీ ట్రాన్స్ఫర్లతో స్కామర్లు పెద్దమొత్తంలో డబ్బు కాజేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మార్చి 27, 28, 29,30 తేదీల్లో పలు లావాదేవీల ద్వారా గురుగ్రాం వాసి సిమ్రజ్జిత్ సింగ్ నందా రూ. 8.5 లక్షలు పోగొట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక మరో తరహా యూట్యూబ్ స్కామ్కు ఇటీవల స్కామర్లు తెరలేపారని పోలీసులు తెలిపారు.
ట్యుటోరియల్స్లా కనిపించే కొన్ని ఏఐ జనరేటెడ్ వీడియోల ద్వారా హానికారక లింక్స్తో మాల్వేర్ను స్కామర్లు వ్యాప్తి చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆన్లైన్లో గుర్తుతెలియని వ్యక్తులతో ఎలాంటి సంప్రదింపులు, లావాదేవీలు చేపట్టరాదని సూచిస్తున్నారు.