అహ్మదాబాద్ : తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టిన తర్వాత మద్యాహ్నం కొద్దిసేపు కునుకు తీస్తోందని మహిళపై అత్తింటి వారు దాడికి తెగబడిన ఘటన నగరంలోని షాహిబాగ్ ప్రాంతంలో వెలుగుచూసింది. 2016లో మెహ్సనాకు చెందిన వ్యక్తితో మహిళకు వివాహమైంది. పెండ్లయిన నాటి నుంచి అత్తింట్లో ఆమెకు వేధింపులు ఎదురయ్యారు.
మద్యాహ్నం నిద్రపోతోందని ఆమెను భర్తతో కలిసి అత్తమామలు వేధించేవారు. తొలుత వీరి ఆగడాలపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా రాజీ చేసుకున్నారు. అటుపై 2017లో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మళ్లీ వేధింపులు మొదలయ్యాయని మహిళ వాపోయింది. మగబిడ్డను కనలేదని అత్తింటి వారు తనను తీవ్రంగా హింసించారని చెప్పుకొచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 7న భర్త తనను వదిలేశాడని, కుల పెద్దలు జోక్యం చేసుకున్నా పట్టించుకోలేదని పేర్కొంది. మాధవపుర పోలీసులకు మహిళ ఫిర్యాదు చేయడంతో భర్త, అత్తమామలపై గృహహింస కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.