లక్షలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే త్వరగా వచ్చేస్తుందని, కావాలంటే ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ అమాయకులను నమ్మబలికించి మోసం చేసే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.
బీహార్లోని పాటలీపుత్ర నగరంలో ఇటీవల రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు గొడవపడుతుండగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. అందులో ఒకరైన వివేక్ కుమార్ మరొక వ్యక్తి అనిల్ సింగ్ తనను ఉద్యోగం పేరిట మోసం చేశాడని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అనిల్ సింగ్ గురించి విచారణ చేశారు. అతడి ఇంట్లో సోదా చేయగా.. అక్కడ సీఎం ఆఫీసుకు సంబంధించి ఒక ప్రభుత్వ సీల్, డీజీపీ కార్యాలయం ముద్ర, అలాగే డిప్యూటీ సీఎం లెటర్ ప్యాడ్ లభించింది. వీటిని పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు మరింత దర్యాప్తు చేయగా.. అనిల్ సింగ్పై ఇదివరకే చీటింగ్ కేసులున్నట్లు తెలిసింది. వివేక్ కుమార్ వద్ద సీఎం ఆఫీసులో ఉద్యోగం రెడీ అంటూ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అతని వద్ద లక్ష రూపాయలతోపాటు ఒక ల్యాప్టాప్ కూడా తీసుకున్నాడు. ఆ తరువాత తన మొబైల్ స్విచాఫ్ చేసి పారిపోయాడు. కొన్ని రోజుల తరువాత రోడ్డుపై వివేక్ కుమార్.. అనిల్ సింగ్ని పట్టుకున్నాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా.. పోలీసులు పట్టుకున్నారు.
ప్రస్తుతం అనిల్ సింగ్ని పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.