
సూర్యాపేట : తక్కువ ధరలకు ఫర్నీచర్ ఇస్తామంటూ వినియోగదారులను నిలువునా ముంచిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రంలోని కుడకుడా రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో తక్కువ ధరలకు ఫర్నిచర్ ఇస్తామంటూ సుమారు 25 రోజుల క్రితం గోల్డెన్ ఏజెన్సీ పేరుతో కొందరు షాప్ ప్రారంభించారు.
షాపులో కొన్ని పేరున్న కంపెనీల బెడ్స్, సోఫాలు, మాట్రిస్, కుర్చీలు, బల్లాలతో పాటు అనేక రకాల గృహోపకరణాలు ఉంచి భారీ ఎత్తున బ్రోచర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. తక్కువ ధరలకు ఇస్తామని నమ్మబలికి డబ్బులు చెల్లించిన 12 రోజులకు వస్తువులు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల వరకు చెల్లించారు. అయితే తొలి విడత 12 రోజులు పూర్తయిన వారికి వస్తువులు అందజేయడంతో తదనంతరం ఆశతో చాలా మంది స్కీంలో చేరారు.

ఇలా దాదాపు 250 మంది వరకు డబ్బులు కట్టగా గత రెండు రోజులుగా షాప్ తాళాలు తియ్యకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీస్తే.. నిర్వాహకులు డబ్బులతో ఉడాయించినట్లు నిర్ధారణ అయింది. దీంతో బుధవారం బాధితులు షాప్ వద్దకు చేరుకొని షాప్లో అందిన కాడికి దోచుకున్నారు.
పోలీసులు రంగంలోకి దిగి షట్టర్లు క్లోస్ చేసి తాళాలు వేశారు. సుమారు 250 మంది దగ్గర ఆర్డర్ రూపంలో రూ.75 లక్షలతో నిర్వాహకులు ఉడాయించినట్లు తెలుస్తున్నది. నిర్వాహకులకు తెలుగు రాదని వారు తమిళంలో మాట్లాడారని బాధితులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.