ములుగు : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రంగారావుపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న తిప్పాని కృష్ణ అనే టీచర్ మంగళవారం విద్యార్థునులకు పాఠాలు చెబుతూనే చెడు ఆలోచనలతో తన వృత్తి ధర్మాన్ని మరిచాడు.
ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినిని ఆధార్ వెరిఫికేషన్ ఉందని చెప్పి ఓ గదిలోకి రమ్మని పిలిచాడు. ఉపాధ్యాయుడి మాటలు నమ్మిన సదరు విద్యార్థిని గదిలోకి వెళ్లిన తర్వాత లైంగిక దాడికి యత్నించాడు. ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ములుగు పోలీస్స్టేషన్లో కీచక టీచర్పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.