పాట్నా: ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఒక కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 6న బక్సర్ పోలీసులు రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్లోని ఘాజీపూర్ నుంచి వస్తున్న ఎస్యూవీని ఆపి సోదా చేశారు. ఆ కారులో ఆరు విదేశీ మద్యం సీసాలు కనిపించాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న సతీశ్ కుమార్, భువనేశ్వర్ యాదవ్కు బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు. వారిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీహార్లో మద్యాన్ని నిషేధించిన నేపథ్యంలో సంబంధిత ఎక్సైజ్ చట్టాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఆ కారులో వారితో పాటు ఉన్న జర్మన్ షెపర్డ్ డాగ్ను కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న కారణంతో దానిని ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ కుక్కకు డాగ్ ఫుడ్ పెడుతున్నారు. అయితే ఆ జర్మన్ షెపర్డ్ కేవలం ఇంగ్లీష్ మాటలను మాత్రమే అర్థం చేసుకుంటున్నదని ఒక పోలీస్ అధికారి తెలిపారు. దీంతో దానికి ఆ మేరకు సూచనలు ఇచ్చేందుకు ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతి కుక్కను పోలీస్ స్టేషన్లో ఉంచడం ఖరీదైన వ్యవహారమని అన్నారు.