తెలుగుయూనివర్సిటీ : ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా ముంబాయికి ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ బ్యాగులలో గంజాయి తరలిస్తున్న ఓ ఘరానా ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ రైల్వే డీఎస్పీ చంద్రభాను, సిఐ శ్రీనివాస్తో కలిసి వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అరకు కేంద్రంగా గంజాయి పండించే వారినుంచి గంజాయి సేకరించిన ఓ ముఠా కుటుంబ సభ్యుల మాదిరిగా ముంబాయికి లగేజీ బ్యాగులలో తరలించే వారిని ఎన్నుకుని పురుషులు, మహిళలతో రైలులో పంపిస్తున్నారు.
14మంది ముఠాలో ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు పిల్లలతో కలిసి వైజాగ్ నుండి సికింద్రాబాద్ మీదుగా ముంబాయికి వెళ్ళే ఎల్టీటీ రైలులో ప్రయాణిస్తూ 24 బ్యాగులలో 336కిలోల గంజాయిను తరలిస్తుండగా లింగంపల్లిలో రైల్వే పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో బుధవారం రాత్రి పట్టుబడిందన్నారు.
పట్టుబడిన గంజాయి విలువ 67లక్షలకు పైగానే ఉంటుందని తెలిపారు. ఈ గంజాయిని ముంబాయికి తరలిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. పట్టుబడిన వారంతా అరకుకు చెందిన మహిళలు, పురుషులని తెలిపారు. కాగా లోతైన విచారణ కొనసాగుతుందని ముఠాలోని ప్రధాన నిందుతులను పట్టుకుంటామని వారు పేర్కొన్నారు.
ప్రత్యేక తనిఖీలు చేపట్టి గంజాయి ముఠాను పట్టుకున్న రైల్వే సిబ్బందని ఆయన అభినంధించారు.