అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సింగనమల మండలం చిన్నజలాలపురంలోని ప్రసిద్ధ గంపమల్లయ్య స్వామి కొండ పైనుండి జారిపడి ఆలయ పూజారి మృతిచెందాడు. ఎత్తయిన కొండపై కొలువైన గంప మల్లయ్య స్వామి దర్శనం కోసం అనంతపురం నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రత్యేకంగా శ్రావణ, మాఘ మాస శనివారాల్లో భక్తులు అధికంగా వస్తుంటారు. రాళ్లు, రప్పలు, చెట్లు, చేమలతో కూడిన ఎత్తైన కొండను జాగ్రత్తగా ఎక్కితే తప్పా స్వామి దర్శన భాగ్యం కలగదు. కానీ ఆలయ పూజారి మాత్రం ఒక చేత్తో హారతి, మరో చేత్తో గంట పట్టుకుని చకచకా ఎక్కిదిగుతుంటారు. కాగా శనివారం ప్రమాదవశాత్తు కాలుజారడంతో ఆలయ పూజారి అంత ఎత్తైనా కొండపై నుంచి పడి తీవ్రగాయాలపాలై చనిపోయాడు.