చెన్నై: బెదిరించి డబ్బులు వసూలు చేస్తు రౌడీ తీరుపై విసుగు చెందిన ఒక వ్యాపారి కత్తితో అతడ్ని పొడిచాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. తిరు వి కా నగర్లోని అయ్యలు వీధికి చెందిన 22 ఏండ్ల సౌందర్ అలియాస్ కుల్లా బాయి రౌడీగా చెలామణి అయ్యాడు. స్థానిక వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూరగాయల వ్యాపారి శివ సుబ్రమణియన్ సోదరుడు ఉక్కిరపాండీని సౌందర్ డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిపై దాడి చేశాడు.
గమనించిన శివ జోక్యం చేసుకున్నాడు. తన సోదరుడ్ని వదిలేయాలని సౌందర్తో అన్నాడు. అయితే శివపై కూడా ఆ రౌడీ దాడి చేశాడు. దీంతో రౌడీ ఆగడాలకు విసుగు చెందిన శివ, సౌందర్ను వెంబడించి కత్తితో మెడ, తల, చేతులపై పొడిచాడు. అనంతరం శివ అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కత్తి పోటు వల్ల గాయపడిన రౌడీ సౌందర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా, రౌడీని కత్తితో పొడిచిన కూరగాయల వ్యాపారి శివను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.