Trazedy Accident | నేలకొండపల్లి: ఎదురెదురుగా ఇండ్లలో ఉంటూ స్నేహితుల్లా మెదిలారు. కష్ట జీవులైనా కలిసిమెలిసి ఉండే వారు. వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాలను పోషించుకునే వారు. ఒకరి ఆపదలో మరొకరు పాలుపంచుకునేందుకు వెళ్లి ఇద్దరూ బావిలో మునిగి మృతి చెందారు. దీంతో ఆ నిరుపేద స్నేహితుల ఇంట తీరని విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లల్లో నివాసం ఉంటున్న కర్లపూడి నాగరాజు (28) పెయింటర్గా జీవనం సాగిస్తున్నాడు. అతడి ఎదురింట్లో ఉంటున్న యండ్రాతి జోజి (36) సుతారి మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి నాగరాజు ఇంట్లో భార్య రమణతో గొడవపడ్డాడు. భర్తపై కోపంతో ఆమె చస్తానంటూ ఇంట్లో నుంచి బయటకెళ్లిపోయింది.
కొద్దిసేపటికే ఎదురింట్లో ఉంటున్న యండ్రాతి జోజిని తీసుకుని నాగరాజు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. స్నేహితుడి భార్య చీకట్లో కన్పించకపోవడంతో బావిలోకి దూకిందనుకొని ఈత వచ్చిన జోజి బావిలోకి దూకాడు. తనకు ఈత రాకపోవడంతో ఒడ్డున ఉన్న నాగరాజు ప్రమాదవశాత్తు జారి బావిలో పడ్డాడు. ఆ శబ్దానికి అక్కడే దగ్గర్లో ఉన్న రమణ బావి వద్దకు వచ్చి భర్త కోసం తానూ దూకింది. ఈ క్రమంలో బావిలో ఉన్న జోజి నీటిలో పడ్డ రమణను కాపాడే ప్రయత్నంలో ఆమెను బావి ఒడ్డుకు తెచ్చాడు.
అదే క్రమంలో ఈత రాక మునిగిపోతున్న నాగరాజు జోజిని గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటి అడుగు భాగంలోకి వెళ్లి రాలేకపోయారు. అక్కడకు చేరుకున్న పలువురు యువకులు రాత్రంతా వారి కోసం బావిలో గాలించినా దొరకలేదు. సోమవారం ఉదయం మళ్లీ ఈతగాళ్లు బావిలోకి దిగి గల్లంతైన ఇద్దరినీ పైకి తీసుకొచ్చారు. భార్య కోసం వెళ్లిన భర్త, అతడి స్నేహితుడు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఇద్దరి కుటుంబాల బంధువులు బోరున విలపించారు.
మృతుడు నాగరాజుకు భార్య రమణతోపాటు ఎనిమిది నెలల చిన్నారి జెసిత ఉంది. జోజికి భార్య మేరీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ధనూష ఇంటర్ ప్రథమ సంవత్సరం, చిన్న కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అప్పటివరకు ఇంట్లో తమ కండ్ల ముందు తిరిగిన వ్యక్తి ఇక లేడన్న వార్త తెలుసుకొని జోజి భార్య, కుమార్తెలు విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన నేలకొండపల్లి ఎస్సై స్రవంతి కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం దవాఖానకు తరలించారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు.