ముంబై: డాక్టర్ దంపతుల సన్నిహిత ఫొటోలతో మాజీ పనిమనిషి బ్లాక్ మెయిల్ చేశాడు. వారిని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఆ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఖర్ పశ్చిమ ప్రాంతానికి చెందిన వైద్య దంపతులు ఒక ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అజీజ్ అనే పనిమనిషి వారింట్లో నాలుగేళ్లు పని చేశాడు. 2016లో ఆ ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించి పారిపోయాడు. దీంతో పనిమనిషిపై వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా, డాక్టర్ భార్య బీరువాలో దాచిన భర్తతో కలిసి ఉన్న సన్నిహిత ఫొటోలు కూడా అజీజ్ చోరీ చేసిన వాటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపై కేసు నమోదు చేసిన డాక్టర్ దంపతులపై అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ నెల 24న ఆ సన్నిహిత ఫొటోలను డాక్టర్ భార్య వాట్సాప్కు పంపాడు. డబ్బుల కోసం అతడు డిమాండ్ చేశాడు. తాను వచ్చి తీసుకుంటానని చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫొటోలను వారి బంధువులకు పంపుతానని బ్లాక్మెయిల్ చేశాడు.
మరోవైపు ఆ మహిళ ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో ఆ డాక్టర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.