హిస్సార్: తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలతో కళకళలాడే ఇంటి పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. పిల్లలు సందడి చేసిన ఇల్లు ఉన్నట్టుండి వల్లకాడైంది. కారణం ఏందో తెలియదుగానీ ఓ వ్యక్తి తన భార్య, ఈడొచ్చిన ఇద్దరు బిడ్డలు, పసివాడైన కొడుకును చంపేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లా అగ్రోహ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంగ్తాలా గ్రామంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం రమేశ్ కుమార్ (43) అనే వ్యక్తి తన ఇంటి ముందే విగతజీవుడై పడి ఉన్నాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రమేశ్ కుమార్ మృతదేహం ఇంటి ముందు ఉండగా.. ఆయన భార్య సవిత (35), ఇద్దరు బిడ్డలు అనుష్క (14), దీపిక (12), కుమారుడు కేశవ్ (10) మృతదేహాలు ఇంటి లోపల కనిపించాయి.
దాంతో పోలీసులు మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం అగ్రోహ మెడికల్ కాలేజీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేశ్ కుమార్ భార్యాబిడ్డలను హత్యచేసి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. అయితే అతను ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికిగల కారణం ఏమిటో తెలియాల్సి ఉందన్నారు.