Road Accident in Karnataka | కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా.. నలుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన కర్నాటకలోని కొప్పల్ జిల్లా కుకనూరు తాలూకాలోని భాన్పురాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్నది. మృతులను దేవప్ప కొప్పాడ (62), గిరిజమ్మ (45), పారవ్వ (32), శాంతమ్మ (22), కస్తూరమ్మగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో హర్షవర్ధన, పల్లవి, పుట్టరాజు, భూమిక తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబమంతా బర్త్ డే పార్టీకి హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అయితే, కారును ఢీకొట్టిన వాహనం ఆచూకీ తెలియరాలేదు. సంఘటనా స్థలంలో వాహనానికి సంబంధించిన మడ్గార్డ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రాంతంలో తరుచూ లారీల రాకపోకలు సాగుతుంటాయి. కారును ఏదైనా టిప్పర్ ఢీకొట్టి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.