భోపాల్ : మధ్యప్రదేశ్ జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం ఇప్పటి వరకు ఎనిమిది మృతి చెందారు. దమోహ్ నాకా శివనగర్లోని ఆసుపత్రిలో మంటలు చెలరేగగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే ఆసుపత్రి అంతటా వ్యాపించాయి. పై అంతస్థులో ఉన్న వారు కిటికీల్లో నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, సీనియర్ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు.
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది ఆసుపత్రిలో ఉన్నారనే విషయం స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందగా.. మరికొంత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. మంటలు చెలరేగాయన్న విషయం తెలుసుకొని ఆసుపత్రిలో ఉన్న వారంతా కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికి మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.