అహ్మదాబాద్: పిల్లల ఆసుపత్రితోపాటు పలు వ్యాపార సంస్థలున్న బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది మంది పిల్లలతో సహా 70 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శనివారం ఈ సంఘటన జరిగింది. పరిమల్ గార్డెన్ సమీపంలో నాలుగు అంతస్తులతో కూడిన దేవ్ కాంప్లెక్స్ ఉంది. కింది అంతస్తులో మొబైల్ ఫోన్ల షాపులతోపాటు రేడియోలజీ సెంటర్, ఐ లేజర్ సెంటర్, పిల్లల ఆసుపత్రి వంటివి మిగతా అంతస్తుల్లో ఉన్నాయి. అయితే మూడో అంతస్తులోని ఒక అకౌంటెంట్ సంస్థ కార్యాలయంలోని సర్వర్ గదిలో మంటలు రాజుకున్నాయి. ఆ మంటలు క్షణాల్లో ఆ బిల్డింగ్కు వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా భయాందోళన చెందారు.
మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది 27 ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. పిల్లల ఆసుపత్రిలోని ఐపీయూలో ఉన్న ముగ్గురు నవజాత శిశివులు, పది మంది పిల్లలతో పాటు సుమారు 70 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. వారిని బిల్డింగ్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొందరు రోగులను సమీప ఆసుపత్రికి తరలించారు.