హైదరాబాద్ : రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాంకులో నుంచి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నికీలలు ఎగిసిపడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎంత మేర నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.