జైపూర్: స్కూల్ నుంచి బహిష్కరణకు గురైన ఒక విద్యార్థి, ప్రిన్సిపాల్ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 15 ఏండ్ల విద్యార్థి గత ఏడాది ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివాడు. అయితే టీచర్లు అతడి గురించి పలు ఫిర్యాదులు చేయడంతో స్కూల్ నుంచి బహిష్కరించారు. కాగా, అతడు శనివారం ఆ స్కూల్కు వచ్చాడు. అక్కడ చదువుతున్న కజిన్ను పికప్ చేసుకుని ఇంటి వద్ద దింపాడు.
అనంతరం అతడు తిరిగి స్కూల్కు వచ్చాడు. నేరుగా ప్రిన్సిపాల్ భగవాన్ త్యాగి ఆఫీస్లోకి వెళ్లాడు. తన వెంట తెచ్చిన నాటు తుపాకీని ప్రిన్సిపాల్పైకి ఎక్కుపెట్టి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రిగర్ జామ్ కావడంతో అతడి ప్రయత్నం ఫలించలేదు.
ఇంతలో ప్రిన్సిపాల్ కేకలు వేయడంతో టీచర్లు, స్కూల్ సిబ్బంది అక్కడకు వచ్చారు. ఆ పూర్వ విద్యార్థిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరిన పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని ధోల్పూర్ ఎస్పీ కేసర్ సింగ్ తెలిపారు.