హయత్నగర్ రూరల్ : పాలిటెక్నిక్ డిప్లామా సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకయ్యాయి. దీనిపై స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. బోర్డు సెక్రటరీ డాక్టర్ శ్రీనాథ్ దీనిపై అబ్దుల్లాపూర్మెట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రవ్యాప్తంగా సీ18 మూడు, నాలుగు సెమిస్టర్లు, సీ21 మొదటి సెమిస్టర్ విద్యార్థులకు బోర్డు డిప్లామా సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పీపీకోడ్ : 6336 (18ఈఈ-302సీ, ఎలక్ర్టికల్ సర్క్యూట్స్), పీపీకోడ్ : 6301 (18సీ-301ఎఫ్, అప్లెడ్ ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్) ప్రశ్నపత్రాలు పరీక్ష కంటే ముందుగానే అబ్దుల్లాపూర్మెట్టు మండలం బాటసింగారంలోని స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీ నుంచి వాట్సాప్ ద్వారా లీకయినట్టు బోర్డు దృష్టికి వెళ్లింది.
కాలేజీ చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, లెక్చరర్ కృష్ణమోహన్ ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్టు బోర్డు అధికారులు గుర్తించారు. బోర్డు సెక్రటరీ శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు.