చండీఘఢ్ : హర్యానాలోని అటేలిలో దారుణం వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపేందుకు డబ్బు డిమాండ్ చేశాడని తాగిన మైకంలో మామను కడతేర్చిన వ్యక్తి ఉదంతం బయటపడింది. 2014లో నిందితుడు పూర్ణ సింగ్కు వివాహమైంది.
ఆపై కొద్దిరోజులకే అతడిని విడిచిపెట్టిన భార్య వేరొకరితో కలిసి ఉంటోంది. వేరొకరితో ఆమె కలిసి ఉంటుండగా ఆ బంధాన్ని గుర్తించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో భార్యను తిరిగి తనతో పంపాలని కోరేందుకు ఆమె పుట్టింటికి వెళ్లాడు. ఈ విషయంలో మామా అల్లుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. తన కూతురుని పంపేందుకు మామ బాబూ సింగ్ అల్లుడిని డబ్బు డిమాండ్ చేశాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తాగిన మైకంలో పూర్ణ సింగ్ మామను గొంతు కోసి కడతేర్చాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఘటన జరిగిన ఎనిమిది గంటల్లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.