అహ్మదాబాద్ : గుజరాత్లో డ్రగ్ మాఫియా చెలరేగుతోంది. తాజా డ్రగ్స్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు కొత్తదారుల్లో పయనిస్తోంది. సింథటిక్ డ్రగ్స్ పనితీరును తెలుసుకునేందుకు బిచ్చగాళ్ల శరీరాలను ప్రయోగ శాలగా మార్చేస్తోంది. వీరిపై పరీక్షించిన డ్రగ్ విజయవంతమైనట్టు తేలితే వీటిని ఇతరులకు బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకు ఆయా డ్రగ్స్ను ప్రవేశపెడుతోంది.
అహ్మదాబాద్లోని వీధులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఇండ్లు లేని అనాధలు, యాచకులే లక్ష్యంగా వారిపై డ్రగ్స్ పనితీరును పరీక్షిస్తోంది. డ్రగ్ మాఫియా అరాచకంతో యాచకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కలుపూర్ రైల్వే స్టేషన్లో యాచకుడిగా బతుకీడుస్తున్న సలీం మహ్మద్ డ్రగ్స్కు బానిసై గంజాయి సేవిస్తుండగా ఆయనకు డ్రగ్ మాఫియా ఇటీవల ఓ మాదక ద్రవ్యాన్ని పరీక్షించేందుకు ఇచ్చింది.
ఆ డ్రగ్ సేవించిన కొద్దిసేపటికే సలీం వాంతులు చేసుకోవడంతో పాటు ముక్కు నుంచి రక్తం కారింది. మహేష్ దతానీ అనే నిరాశ్రయుడికి పొడి రూపంలో ఉన్న డ్రగ్ను ఇవ్వగా అతడు సైకోలా ప్రవర్తించడం కలకలం రేపింది. దతానీ తన కాళ్లు, చేతులను గోడకు బలంగా కొట్టుకోవడంతో గాయాలైన పరిస్ధితి నెలకొంది. డ్రగ్ మాఫియా ఆగడాలు తమ దృష్టికి వచ్చాయని అయితే ఈ దిశగా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.