శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యం, వేగంగా కారునడిపి సైక్లిస్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గచ్చిబౌలికి చెందిన నితిన్ అగర్వాల్ (44), సుచిత్ శ్రీవాత్సవా, రాజీవ్ గజానీయలు స్నేహితులు. ఐటీ కారిడార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరు గచ్చిబౌలి రాంకీ టవర్స్లో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 5ః45 నిముషాలకు నితిన్ అగర్వాల్ తన స్నేహితులతో కలిసి 100 కిలోమీటర్ల సైక్లింగ్కు బయలుదేరారు. గచ్చిబౌలి, అంజయ్యనగర్, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రహాదారి మీదుగా సెంట్రల్ యూనివర్సిటీ రహాదారి వైపు వెళ్తున్నారు.
బొటానికల్ గార్డెన్ పాలపిట్ట పార్క్ ముందుకు చేరుకోగానే వెనకనుంచి అతివేగంగా, నిర్లక్షంగా దూసుకువచ్చిన స్విఫ్ట్ డిజైర్కారు (టీఎస్07ఎప్పీ4028) నితిన్ అగర్వాల్ను బలంగా ఢీకొట్టి అదుపు కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న స్తంబానికి ఢీకొంది. దీంతో తల, కాళ్లకు తీవ్రగాయాలైన నితిన్ అగర్వాల్ను తోటి మిత్రులు సమీపంలోని గచ్చిబౌలి ఎఐజీ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు.
మజీదుబండాకు చెందిన శశాంక్ శంకర్ 24, మానవ్లు ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నారు. స్నేహితుడు శ్రీకాంత్తో కలిసి గురువారం మజీద్బండాలోని శశాంక్ ఇంట్లో ముగ్గరు పార్టీ చేసుకున్నారు. అనంతరం తెల్లవారుజామున టిఫిన్ చెసేందుకు మాదాపూర్కు స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్లి తిరిగి వస్తుండగా బొటానికల్ గార్డెన్ వద్ద మద్యం మత్తులో శశాంక్ నిర్లక్ష్యంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రోడ్డు ప్రమాదంలో సైకిల్ రెండు ముక్కలు కాగా కారు స్తంబానికి ఢీకొని కారు బెలూన్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు బ్రీత్ ఎన్లైజర్తో పరీక్షలు నిర్వహించగా కారు నడిపిన శశాంక్కు 186, మానవ్కు 276 వచ్చినట్టు పేర్కొన్నారు. రాంకీ టవర్స్కు చెందిన సుచిత్ శ్రీవాత్సవ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.