వనస్థలిపురం : తమ పెంపుడు కుక్క తప్పిపోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తనకు కుక్క దొరికిందని ఓ వ్యక్తి తిరిగి ఇచ్చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు వివరాలిలా ఉన్నాయి.
హయత్నగర్ డివిజన్ శారదానగర్కు చెందిన సంతోష్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా రాఖీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. డిసెంబర్ 30న ఆ కుక్క తప్పిపోయింది. దీంతో సంతోష్ కుటుంబం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. చేసేది లేక మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన తట్టి అన్నారం గ్రామానికి చెందిన సత్యనారాయణ తన దగ్గర ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. భాగ్యలత కాలనీలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న సత్యనారాయణ దగ్గరకు రాఖీ వచ్చింది.
ఎంతకూ అక్కడి నుంచి వెళ్లక పోవడంతో పెంచుకునేందుకు తనతోపాటు ఇంటికి తీసుకువెళ్లాడు. తప్పిపోయిన విషయం తెలియడంతో పోలీసులకు అప్పగించారు. దీంతో కథ సుఖాంతమయ్యింది. రాఖీ సొంతింటికి చేరగా, కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు.