అహ్మదాబాద్ : భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళను మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం చేసుకుని ఆపై పెండ్లి పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం గుజరాత్లో వెలుగుచూసింది. సెప్టెంబర్ 23న విసాత్-గాంధీనగర్ హైవే సమీపంలోని ఓ హోటల్ రూంలో నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. 2019లో భర్త నుండి విడాకులు పొందిన వడోదరకు చెందిన మహిళ మళ్లీ వివాహం చేసుకునేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. ఇదే వేదికపై పరిచయమైన ధ్రుమిత్ సోలంకి (28)కి ఆమె దగ్గరైంది. ఫోన్ నెంబర్లు మార్చుకున్న ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు.
ఈ క్రమంలో సోలంకి పెండ్లి ప్రతిపాదనను ఆమె ముందుంచాడు. సెప్టెంబర్ 22 రాత్రి 10 గంటల సమయంలో సోలంకిని కలిసేందుకు విసాత్ ప్రాంతానికి వచ్చిన మహిళను హోటల్ రూంకు తీసుకువెళ్లాడు. ఆ రోజు రాత్రి పెండ్లి చేసుకుంటానని మభ్యపెడుతూ ఆమెపై సోలంకి లైంగిక దాడికి పాల్పడగా మరుసటి రోజు బాధితురాలు వడోదరకు తిరిగివెళ్లింది. ఇక అక్టోబర్ 18న తనకు వేరొక మహిళతో పెండ్లి ఖాయమైందని తనను మరిచిపోవాలని నిందితుడు బాధితురాలితో చెప్పాడు. నిరాశకు గురైన మహిళ మంగళవారం చంద్ఖేడాలోని నిందితుడి ఇంటికి వచ్చి అతడిని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నిందితుడి నుంచి స్పందన లేకపోవడంతో బాధితురాలు నిందితుడిపై లైంగిక దాడి కేసు నమోదు చేసింది.