న్యూఢిల్లీ : ఐఫోన్, యాపిల్ డివైజ్లను సొంతం చేసుకోవడం స్టేటస్ సింబల్గా మారిన క్రమంలో ఈ హాట్ డివైజ్ల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో వాటిని సొమ్ము చేసుకుని భారీగా దండుకోవచ్చనే దురాశతో చెలరేగుతున్నారు. ఇక ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ పది ఐఫోన్లను (iPhones) డెలివరీ చేసే క్రమంలో వాటి స్ధానంలో ఫేక్ ఐఫోన్లను ఉంచి రియల్ ఐఫోన్లను దోచుకున్న ఉదంతం గురుగ్రాంలో కలకలం రేపింది.
అమెజాన్ పార్సిళ్లు డెలివరీ చేసే మ్యాట్రిక్స్ ఫైనాన్స్ సొల్యూషన్ స్టేషన్ ఇన్చార్జ్ రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మార్చి 27న లలిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్కు కస్టమర్కు డెలివరీ చేయాలని పది ఐఫోన్లు, ఎయిర్పాడ్స్తో కూడిన పార్సిల్ అందచేశారు. అయితే ఈ పార్సిల్ స్ధానంలో ఫేక్ ఐఫోన్లతో కూడిన పార్సిల్ను కస్టమర్ అందుబాటులో లేడంటూ కంపెనీకి రిటన్ చేశారు.
లలిత్ తన సోదరుడు మనోజ్ సహకారంతో ఈ నిర్వాకం సాగించాడు. ఆపై పార్సిల్ తిరిగి రావడంతో ప్యాకేజింగ్ను ట్యాంపర్ చేసినట్టు అనుమానించిన కంపెనీ పార్సిల్ను ఓపెన్ చేసి చూడగా లోపల నకిలీ ఐఫోన్లు కనిపించాయి. కంపెనీ ఫిర్యాదు ఆధారంగా బిలాస్పూర్ పోలీస్ స్టేషన్లో లలిత్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.