జైపూర్: ఉద్యోగం పేరుతో మహిళను రప్పించిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ చేతులు, కాళ్లు కట్టేసి హోటల్ మిద్దె నుంచి తోసేశారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. చురూ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు, ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహిళకు ఫోన్ చేశారు. ఉద్యోగానికి ఎంపిక అయినట్లు నమ్మించి చురూ నగరానికి ఆమెను రప్పించారు. అక్కడ ఒక హోటల్లో ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కాగా, మద్యం సేవించిన నలుగురు యువకులు అనంతరం ఆ మహిళ చేతులు, కాళ్లను తాడుతో కట్టేశారు. ఆమెను హోటల్ పైనుంచి తోసేశారు. అయితే ఒక పోల్కు తాడు చిక్కుకోవడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలి ఫిర్యాదుతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.