న్యూఢిల్లీ: స్కూల్ బయట ఇద్దరు విద్యార్థుల మధ్య కొట్లాట మరో విద్యార్థి ఉసురు తీసింది. వైరి వర్గంలోని ఓ వ్యక్తి గన్తో కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నైరుతి ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 16 ఏలోని ఒక పాఠశాల బయట శనివారం ఇద్దరు విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఒక బాలుడు తన స్నేహితుడైన 19 ఏండ్ల విద్యార్థి ఖుర్షీద్ని పిలిపించాడు. మరో బాలుడు తన వర్గాన్ని రప్పించాడు. దీంతో ఇరువురి విద్యార్థుల మధ్య ఫైట్ తీవ్రస్థాయికి చేరింది.
ఈ క్రమంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి విద్యార్థి ఖుర్షీద్పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపి యువకుడ్ని హత్య చేసిన నిందితుడ్ని సాహిల్ అలియాస్ మోను అలియాస్ లాథర్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఆయుధ చట్టంలోని సెక్షన్లతోపాటు హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.