న్యూఢిల్లీ : దొంగనెపంతో ఓ మహిళను 24 గంటల పాటు నగ్నంగా బంధించి, హింసించారు. ఈ అవమానాన్ని భరించలేని బాధితురాలు ఎలుకల మందు తాగింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది.
దక్షిణ ఢిల్లీలోని ఓ ఇంట్లో 10 నెలల క్రితం దొంగతనం జరిగింది. ఆ ఇంట్లో పని చేస్తున్న పని మనషులను విచారించినప్పటికీ.. దొంగతనం చేసిందేవరో తేలలేదు. చోరీ చేసింది ఎవరో తెలుసుకోవాలని ఆ ఇంటి యజమాని ఆలోచిస్తూనే ఉన్నాడు. దీంతో ఆగస్టు 9న ఇంటి యజమానురాలు.. ఒక మంత్రగాడిని ఇంటికి పిలిపించింది. దొంగతనం ఎవరూ చేశారో మీ పూజల ద్వారా చెప్పాలని ఆ మంత్రగాడిని యజమానురాలు కోరింది.
ఇక ఆ మంత్రగాడు.. పని మనషులందరికీ అన్నం, సున్నం కలిపి ఇచ్చాడు. ఎవరి నోరు అయితే ఎర్రబడుతుందో వారే దొంగ అని చెప్పాడు. ఓ పని మనిషి ముఖం ఎర్రబడటంతో.. ఆమె దొంగతనం చేసిందని భావించారు. ఇక ఆ పని మనిషిని ఇంట్లోని ఓ గదిలో యజమానురాలు బంధించింది. ఆమె బట్టలు విప్పి నగ్నంగా ఉంచింది. పని మనిషిని తీవ్రంగా హింసించింది. ఒకట్రెండు గంటలు కాదు ఏకంగా 24 గంటల పాటు ఆమెను నగ్నంగా ఉంచి, శారీరకంగా వేధింపులకు గురి చేసింది. యజమానురాలి బాధలు తాళలేక.. బాధితురాలు ఎలుకల మందు తాగింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పని మనిషిని హింసించిన యజమానురాలిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.