శ్రీనగర్: చనిపోయిన పసి బిడ్డను పూడ్చిపెట్టగా, గంట తర్వాత బతికింది. ఈ వింత ఘటన జమ్ముకశ్మీర్లో జరిగింది. రాంబన్ జిల్లా బనిహాల్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని బంకూట్ గ్రామానికి చెందిన బషారత్ అహ్మద్ గుజ్జర్ భార్య షమీమా బేగం సోమవారం ఉదయం ఉప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో హోలాన్ గ్రామంలో ఆ శిశువును పూడ్చిపెట్టారు. ఆసుపత్రికి తిరిగి వస్తుండగా ఆ గ్రామస్తులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సుమారు గంట తర్వాత పూడ్చిన ఆడ శిశువును గోతి నుంచి బయటకు తీశారు. అయితే ఆ చిన్నారి బతికి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్లోని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆ కుటుంబం, బంధువులు నిరసన వ్యక్తం చేశారు. బతికున్న శిశువు చనిపోయినట్లుగా చెప్పడంపై మండిపడ్డారు. దీంతో బనిహాల్ బ్లాక్ వైద్య అధికారిణి డాక్టర్ రబియా ఖాన్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ నర్సు, ఒక స్పీపర్ను సస్పెండ్ చేశారు.