న్యూఢిల్లీ: ఇంటిని గ్యాస్ చాంబర్గా మార్చి తల్లీ, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని విలాసవంతమైన వసంత విహార్ అపార్ట్మెంట్ సొసైటీలోని ఒక ఇంటి డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉందని, అందులోని వారు చాలా గంటలుగా బయటకు రాలేదంటూ పని మనిషి, పొరుగు వారు పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. లోపల గదిలో మరణించిన 50 ఏండ్ల మంజు శ్రీవాస్తవ, ఆమె ఇద్దరు కుమార్తెలు అన్షిక, అంకు మృతదేహాలను కనుగొన్నారు. ఇంట్లోని కిటికీలు, వెంటిలేటర్ ప్రాంతాలను పాలిథిన్ కవర్లతో పూర్తిగా మూసి ఉండటాన్ని గమనించారు. గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి ఉండగా, మృతదేహాల దగ్గర మండుతున్న బొగ్గు ఉన్నది. దీంతో ఆ గదిని విష వాయువు చాంబర్గా మార్చి వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గ్రహించారు.
కాగా, సూసైడ్ నోట్తోపాటు ఇంటి లోపలికి వచ్చే వారి కోసం కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ రాసిన పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘చాలా ప్రాణాంతకమైన వాయువు. కార్బన్ మోనాక్సైడ్ లోపల ఉంది. ఇది మండుతుంది. దయచేసి కిటికీ తెరిచి, ఫ్యాన్ వేసి గదిని వెంటిలేట్ చేయండి. అగ్గిపెట్టె, కొవ్వొత్తి లేదా మరేదైనా వెలిగించవద్దు. గది నిండా ప్రమాదకరమైన గ్యాస్ ఉంది. కాబట్టి కర్టెన్ను తొలగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ను పీల్చవద్దు’ అని ఇంగ్లీష్లో రాసి ఉంది.
మరోవైపు ఆ మహిళ భర్త ఉమేష్ చంద్ర శ్రీవాస్తవ గత ఏడాది కరోనాతో మరణించినట్లు ఇంటి పనిమనిషి, పొరుగున ఉన్నవారు పోలీసులకు తెలిపారు. నాటి నుంచి ఆ కుటుంబం చాలా నిరాశతో ఉందని చెప్పారు. మంజు కూడా ఇటీవల అనారోగ్యం బారినపడి మంచానికే పరిమితమైందని అన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు మహిళల ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు.